ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!

  • ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేంద్రానికి వెళ్లిన బుమ్రా
  • ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన
  • గాయమా? లేక సాధారణ తనిఖీనా? అనే దానిపై వీడని సందిగ్ధత
  • ఆదివారం కేకేఆర్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి వారం కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ముంబై జట్టు క్యాంప్‌లో చేరకుండా నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు వెళ్లినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. దీంతో అతని ఫిట్‌నెస్‌పై చర్చ మొదలైంది.

బుమ్రా గాయం కారణంగా అక్కడికి వెళ్లాడా? లేక సాధారణ ఫిట్‌నెస్ పరీక్షల కోసమా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండగా, బుమ్రా జట్టుతో కలవకపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులకు ఐపీఎల్ క్యాంపులో చేరడానికి ముందు అదనపు విశ్రాంతిని ఇచ్చినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గతంలోనే ప్రకటించారు. బహుశా ఆ కారణంగానే బుమ్రా ఆలస్యంగా జట్టుతో చేరతాడని మేనేజ్‌మెంట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌కు బుమ్రా చాలా కీలకమని, ప్రతి మ్యాచ్‌లోనూ అతను ప్రభావం చూపిస్తాడని అన్నాడు. బుమ్రా వేసే నాలుగు ఓవర్లు జట్టుకు అత్యంత విలువైనవని పేర్కొన్నాడు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో బుమ్రా 12 మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల‌ 29న వాంఖడే స్టేడియంలో కేకేఆర్‌తో ఆడనుంది.

Jasprit Bumrah
Mumbai Indians
IPL 2026
BCCI
Indian Premier League
T20 World Cup
Kolkata Knight Riders
MI
Cricket
Fitness

More Telugu News